జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించే దిశగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY) కింద గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందిన 9,000 మంది యువతకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 15 నుంచి 35 ఏళ్ల వయస్సు గల యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సుమారు 15 విభిన్న రంగాల్లో ఈ నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు, అక్టోబర్ మొదటి వారంలో తొలి విడత శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనికోసం మండల స్థాయిలో ప్రత్యేక రిజిస్ట్రేషన్ క్యాంపులు నిర్వహించనున్నారు. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, యువతకు కెరీర్ గైడెన్స్ మరియు భవిష్యత్తులో అధిక వేతనాలు పొందే అవకాశాలపై అవగాహన కూడా కల్పించనున్నారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారిని ఆర్థికంగా స్థిరపడేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
గుంటూరు యువతకు కేంద్ర మంత్రి గుడ్న్యూస్.. 9,000 మందికి శిక్షణ, ఉపాధి!
pemmasani-chandrasekhar-announces-skill-training-and-employment-for-9000-youth-in-guntur
