విజయవాడ, 2026 సెప్టెంబర్ 19, (జనగళం బ్యూరో):
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ను శనివారం జనసేన పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నాయకులు, 36వ డివిజన్ అధ్యక్షుడు ప్రభుజి యాంపాటి పార్టీ ప్రతినిధులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీ అభివృద్ధికి ప్రభుజి యాంపాటి అంకితభావంతో సేవలందిస్తున్నారని నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు ఆయన తన సొంత కల్యాణ మండపాలను ఉచితంగా కేటాయించి వెన్నుదన్నుగా నిలిచారని వివరించారు. రాబోయే ఎన్నికల్లో 59వ డివిజన్ (పాత 36వ డివిజన్) కార్పొరేటర్ అభ్యర్థిగా ప్రభుజి యాంపాటికి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు.
సామాజిక సమీకరణాలు అనుకూలం – మంత్రి హామీ:
డివిజన్ పరిధిలో ఆయన కుటుంబానికి ఉన్న సుదీర్ఘ అనుబంధం, బంధుమిత్రుల మద్దతు, సామాజికవర్గ సమీకరణాలు, గెలుపునకు ఉన్న సానుకూల పరిస్థితులను నాయకులు మంత్రికి సమగ్రంగా వివరించారు. వీటన్నింటినీ ఓపికగా విన్న మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించారు. ప్రభుజి వివరాలు నమోదు చేసుకుని, కూటమి పొత్తుల సర్దుబాటులో భాగంగా ఈ సీటు జనసేన పార్టీకే దక్కేలా అధిష్టానం వద్ద చొరవ తీసుకుంటామని, పోటీ చేసే అవకాశాన్ని తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
