పిఠాపురం/కాకినాడ, 2026 సెప్టెంబర్ 19, (జనగళం బ్యూరో):
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యుత్తమ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. తన శాఖల పరిధిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ విభాగాలతో పాటుగా ప్రభుత్వంలోని అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు రూ. 1,500 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ పనులకు ఆయన పచ్చజెండా ఊపనున్నారు. ఈ మేరకు సోమవారం నుంచి రెండు రోజుల పాటు పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి విస్తృతంగా పర్యటించనున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి, పర్యటనలో భాగంగా తొలిరోజు సోమవారం నాడు ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల పరిధిలోని దాదాపు 52 ఆవాసాలకు చెందిన 97 వేల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ. 9.59 కోట్లతో సమగ్రంగా ఆధునీకరించిన ‘నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని’ పవన్ కళ్యాణ్ జాతికి అంకితం చేయనున్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ పథకం సరైన నిర్వహణ లేక శివారు గ్రామాలకు నీరందక నిరుపయోగంగా మారిన దుస్థితిని గమనించిన ఆయన, ప్రత్యేక నిధులు మంజూరు చేయించి ఆధునీకరణ పూర్తి చేయించారు. దీంతోపాటు పిఠాపురం పట్టణంలో ఆహ్లాదకరమైన వాతావరణం, 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంతో తీర్చిదిద్దిన “పీఠికాపుర వనం” పార్కును ప్రారంభించనున్నారు. అలాగే రూ. 100 కోట్ల సాస్కీ నిధులతో నిర్మించిన చందుర్తి, తాటిపర్తి బీటీ రోడ్డు, సరికొత్త హంగులతో సుందరీకరించిన ఎఫ్.కె. పాలెం మైసమ్మ చెరువులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
బహిరంగ సభలో వందల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం:
రెండో రోజైన మంగళవారం నాడు పిఠాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ వేదికపై నుంచి నియోజకవర్గ ముఖచిత్రాన్ని మార్చేలా పలు ప్రధాన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా దశాబ్దాలుగా పిఠాపురం ప్రజలు ఎదురుచూస్తున్న రూ. 200 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్, రూ. 80 కోట్ల ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (AIIB) నిధులతో గొల్లప్రోలు వాటర్ వర్క్స్, రూ. 307 కోట్ల జల్ జీవన్ మిషన్ మరియు అమరజీవి జలధారల నిధులతో మల్టీ విలేజ్ సమగ్ర తాగునీటి పథకం, అమృత్ 2.0 ద్వారా పిఠాపురం మున్సిపాలిటీ వాటర్ వర్క్స్, స్థానిక ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలిచే రూ. 118 కోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB), తీర ప్రాంతాన్ని కడలి కోత నుంచి కాపాడేలా రూ. 323 కోట్లతో ఉప్పాడ తీర రక్షణ గోడ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
మత్స్యకారులకు అండ – మహిళలకు ఆర్థిక భరోసా:
మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పేద వర్గాలు, శ్రామికుల సాధికారతకు పవన్ కళ్యాణ్ పెద్దపీట వేయనున్నారు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల వేటకు పూర్తి భద్రత కల్పించేలా అధునాతన నాణ్యమైన లైఫ్ జాకెట్లు, స్వయం ఉపాధి కోసం డ్రై ఫిష్ యూనిట్లు, పట్టుకున్న చేపలు పాడవకుండా రవాణా చేసుకునేందుకు వీలుగా ఐస్ బాక్సులతో కూడిన మోటార్ సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహిస్తూ సెర్ప్, మెప్మా సహకారంతో స్వయం సహాయక సంఘాలకు రూ. 120 కోట్ల భారీ బ్యాంక్ లింకేజ్ రుణాలను అందజేయనున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరిస్తూ 89 మంది అర్హులైన లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ హక్కు పట్టాలను స్వయంగా పంపిణీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం నియోజకవర్గవ్యాప్తంగా పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.
