తెలంగాణ డెస్క్: తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి వరంగల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పార్టీ మారబోతున్నారంటూ ప్రచారంలో ఉన్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. పదవి కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోమని, కాంగ్రెస్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకసారి క్షమాపణ చెబితే సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు సురేఖతో అన్నారని, కానీ పదవి ఉన్నా లేకున్నా క్షమాపణ చెప్పేది లేదని సురేఖ కరాఖండిగా చెప్పినట్లు ఆనాటి విషయాలను మురళి వివరించారు. కృతజ్ఞత తమ రక్తంలోనే ఉందని, ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తమ విధేయతన చాటుకుంటామని పేర్కొన్నారు.
రాహుల్గాంధీ చొరవ వల్లనే సురేఖకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం దక్కిందని, ఆయనను ప్రధానిగా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని కొండా మురళి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే తాము టికెట్లు ఇస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వంటి ప్రముఖులు సైతం ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చారని గుర్తుచేశారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరఫున తాము చురుగ్గా పాల్గొంటామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో భావోద్వేగానికి గురైన మురళి, తన శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నప్పటికీ ఇంకా సజీవంగానే ఉన్నానని వ్యాఖ్యానించారు.
తాము ఇద్దరం ఒకే మాటపై నిలబడతామని స్పష్టం చేసిన మురళి, తమ కుమార్తె రాజకీయ భవిష్యత్తు మాత్రం ఆమె వ్యక్తిగత ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారనే అంశంపై స్పష్టత వచ్చినట్లయింది. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ రానున్న కాలంలోనూ కాంగ్రెస్తోనే ప్రయాణం చేయనున్నట్లు వారు తేల్చిచెప్పారు.
