ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
- విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సమృద్ధి నిండాలని ఆకాంక్ష
- గుంటూరు ప్రగతి పథంలో దూసుకుపోవాలని గణనాథుడికి ప్రార్థన
- పర్యావరణ హితంగా మట్టి వినాయకులనే పూజిద్దాం: కేంద్ర సహాయ మంత్రి పిలుపు
గుంటూరు / న్యూఢిల్లీ:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖల సహాయ మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు, రాష్ట్ర ప్రజానీకానికి, ఎన్డీయే కూటమి శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని అనుగ్రహించే ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని కోరుకున్నారు. ప్రజలు తలపెట్టే ప్రతి సత్కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని గణనాథుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం, గుంటూరు ప్రాంతం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మరింత వేగంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూనే, భావితరాల భవిష్యత్తు కోసం పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలకు బదులుగా మట్టితో చేసిన వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించి పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.
