jangalam24 ఆంధ్రప్రదేశ్ డెస్క్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నూజివీడులోని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి క్యాంపు కార్యాలయంలో గణపతి పూజా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మంత్రివర్యుల తనయుడు, ప్రముఖ వ్యాపారవేత్త, నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ అధినేత కొలుసు నితిన్ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విఘ్నేశ్వరుడికి శాస్త్రోక్తంగా అర్చనలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా కొలుసు నితిన్ కృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై ఆ విఘ్నాధిపతి చల్లని చూపు నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి ఇంటా ఆనందపు వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. ఏ పని ప్రారంభించినా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని గణపతి అనుగ్రహం కోరినట్లు పేర్కొన్నారు.
క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తులకు, నాయకులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కొలుసు నితిన్ కృష్ణ స్వయంగా హాజరై పూజలు నిర్వహించడంతో క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో పండుగ శోభ మరింత ఉట్టిపడింది.
