జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం నుంచి రామన్నగూడెం మీదుగా వట్టిగుడిపాడు గ్రామం వెళ్లే ప్రధాన రహదారిలో పురపాలక సంఘం డంపింగ్ యార్డు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీకి దాదాపు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డు స్థలం ఉన్నప్పటికీ, శానిటేషన్ సిబ్బంది పట్టణంలోని చెత్తాచెదారాన్ని ప్రధాన రహదారి పక్కనే పారబోస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
రహదారి పక్కనే గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాల నుంచి వెలువడే తీవ్ర దుర్గంధం, వ్యర్థాల దహనంతో వచ్చే పొగ, దోమలు, ఈగల బెడదతో ఆ మార్గంలో రాకపోకలు సాగించలేక ప్రజలు, వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ తీవ్రమైన సమస్యపై నూజివీడు మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వెంటనే దృష్టి సారించి రోడ్డు పక్కన చెత్త వేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
