జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆకస్మిక మరణం పట్ల అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీవ్ర బాధాకరమని పేర్కొంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎంతో హుందాగా, వివాదరహితుడిగా మెలిగిన ఆళ్ల నానితో తనకు ఎంతో సన్నిహితమైన, ఆత్మీయమైన అనుబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు.
గత జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఎక్కడా పరుష పదజాలం వాడకుండా, సభ్యత, సంస్కారాలతో ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించిన ఏకైక మంత్రి ఆళ్ల నాని అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా విశేష కృషి చేశారని ప్రశంసించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకతప్త కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
