ఆంధ్రప్రదేశ్ డెస్క్: కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శనివారం వేకువజామున మూడు గంటలకు ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దక్షిణ ముఖద్వారం ద్వారా ఆలయం లోపలికి ప్రవేశించిన పవన్ కళ్యాణ్, అత్యంత పవిత్రమైన వేకువజాము నిర్మాల్య దర్శనంలో పాల్గొన్నారు. దాదాపు ముప్పై నిమిషాలపాటు ఈ విశిష్ట సేవలో పాల్గొని గర్భాలయంలో మూలవిరాట్టుకు నిర్వహించిన ప్రత్యేక కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో తిలకించారు.
నిర్మాల్య దర్శనానంతరం సంప్రదాయం ప్రకారం జరిగే తైలాభిషేకం, శంఖాభిషేకం, వాకచార్థు సేవల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గంధాన్ని తొలగించి అభ్యంగన స్నానం చేయించే సేవ గురించి ఆలయ అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా నైరుతిలో ఉన్న వినాయకుడిని దర్శించుకుని, ఆలయ ఆచారాలను అనుసరిస్తూ గుడి వెనుక భాగంలో సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయస్వామి, అనంత పద్మనాభ స్వామి, భగవతి అమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు, ప్రదక్షణలో అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఆయుర్వేద థెరపీ చేసిన వైద్యులు కూడా ఆయనతో పాటు స్వామి వారిని దర్శించుకున్నారు.
గురువాయూర్ దర్శనం ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ సమీపంలోని మామ్మియూర్ మహాదేవ ఆలయాన్ని సందర్శించారు. శనివారం వేకువజామున పరమ శివుని పూజలో పాల్గొని ప్రత్యేక అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మలబార్ దేవస్థానం బోర్డు సభ్యులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయ దర్శనం తర్వాత మామ్మియూర్ మహాదేవుని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆలయంలో పార్వతీపరమేశ్వరులతో పాటు శ్రీ మహావిష్ణువు, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప, భగవతి అమ్మవారు, నాగదేవతలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ గోడలపై చిత్రించిన కళాఖండాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
