తెలంగాణ డెస్క్: వినాయక చవితి వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూ సంప్రదాయంలో ఏ విఘ్నమైనా తొలగించి విజయాలను ప్రసాదించే దైవంగా వినాయకుణ్ణి సమాజం కొలుస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
మన ఆచారాల ప్రకారం ఏ దైవ పూజలు లేదా ధార్మిక క్రతువులు ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుడినే పూజిస్తామని, తద్వారా గణనాయకుడికి తొలి ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో వాడవాడలా ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు గణేశ్ నవరాత్రులు జరుపుకుంటారని, ఈ పండుగలో పెద్దలు, పిల్లలు అందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని పూజలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లేలా చూడాలని ఏకదంతుడిని ప్రార్థించినట్లు కేసీఆర్ వెల్లడించారు. వ్యవసాయ రంగం మళ్లీ పూర్తిగా గాడినపడి, పాడిపంటలతో తెలంగాణ రైతు కుటుంబాలన్నీ సుఖసంతోషాలతో కళకళలాడేలా దీవించాలని వినాయకుడిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
