తెలంగాణ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు మహేందర్రెడ్డితో పాటు పీఆర్వో మహేశ్కు సైఫాబాద్ పోలీసులు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. గడచిన ఏడో తేదీన అసెంబ్లీ గేట్ నంబర్ మూడు వద్ద చోటుచేసుకున్న పలు ఘటనలకు సంబంధించి ఈ నోటీసులు అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు ఉదయం పది గంటల సమయానికి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొనేందుకు హాజరు కావాలని పోలీసులు స్పష్టం చేశారు.
అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే వీరిద్దరిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేందర్రెడ్డి, మహేష్లు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం వారి పిటిషన్పై విచారణ జరిపి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు వీరిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీస్ శాఖను కోర్టు ఆదేశించింది. అదే సమయంలో చట్టపరమైన విచారణ ప్రక్రియకు పూర్తిగా సహకరించాలని వారికి న్యాయస్థానం సూచించింది.
కోర్టు నుంచి వెలువడిన ఆదేశాల ప్రకారమే పోలీసులు తాజాగా ఈ నోటీసులను జారీ చేయడం జరిగింది. రేపు ఉదయం పది గంటలకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు చేరుకుని దర్యాప్తునకు సహకరించాలని నోటీసుల్లో పునరుద్ఘాటించారు. అయితే పండుగ రోజునే విచారణకు హాజరు కావాలని పోలీసులు పేర్కొనడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
