రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొలుసు పార్థసారథి
- విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్ష
- పర్యావరణ హితంగా మట్టి వినాయకులనే పూజిద్దాం: మంత్రి పిలుపు
నూజివీడు / అమరావతి:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి రాష్ట్ర ప్రజలకు, ఏలూరు జిల్లా మరియు నూజివీడు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజలు తలపెట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం, యువతకు సర్వతోముఖాభివృద్ధి చేకూరాలని గణనాథుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. గణపతి కృపాకటాక్షాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి సంతోషాలు వెల్లివిరియాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత సుభిక్షంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించి, మట్టితో చేసిన వినాయక ప్రతిమలనే పూజించాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆయన కోరారు.
