జనగళం 24 ఆంధ్ర డెస్క్: కృష్ణా జిల్లా పెడన పట్టణంలో ఈ నెల పదిహేడో తేదీన జరగనున్న తెలుగుదేశం పార్టీ కేడర్ సమావేశానికి రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విచ్చేస్తున్న నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, పార్టీ పరిశీలకులు షేక్ ఆషా, పర్యటన సమన్వయకర్త బండారు హనుమంతరావులతో కలిసి సభా ప్రాంగణం, ర్యాలీ మార్గం, భద్రతా చర్యలను నిశితంగా సమీక్షించారు.
మంత్రి పర్యటనకు భారీ ఎత్తున ప్రజలు, శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, నిరంతర విద్యుత్ తదితర మౌలిక వసతులను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయేలా మంత్రి లోకేష్కు అపూర్వ స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.
