జన గళం క్రైమ్ డెస్క్: కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాల నెట్వర్క్పై పోలీసులు ఉక్కుపాదం మోపినట్లు తెలుస్తోంది. యువత భవిష్యత్తును చిదిమేస్తున్న మత్తు పదార్థాల విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు, పక్కా సమాచారంతో ఒక గంజాయి ముఠాలోని కొందరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనుమానితుల నుంచి గంజాయి సరఫరా చేసే ముఠా మూలాలు, ప్రధాన సూత్రధారులు, పట్టణంలో తరచూ కొనుగోలు చేసే వారి వివరాలను రాబడుతున్నట్లు వార్తలు రావడంతో స్థానికంగా తీవ్ర అలజడి రేగింది. పోలీసుల విచారణలో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనన్న భయంతో గంజాయి సేవించే, సరఫరా చేసే పలువురు యువకులు ఊరు విడిచి పరారైనట్లు స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది.
పోలీసుల అదుపులో ఉన్న అనుమానితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నెట్వర్క్లోని మిగిలిన సభ్యులను, ఇతర ప్రాంతాల నుంచి సరుకును తీసుకొస్తున్న ప్రధాన డీలర్లను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటివరకు పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు. క్షేత్రస్థాయిలో దాడులు, విస్తృత విచారణ పూర్తయిన అనంతరం గంజాయి స్వాధీనం, అరెస్టుల వివరాలపై స్పష్టతనిస్తూ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
