జనగళం 24 ఆంధ్ర డెస్క్: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఎస్.వి.డి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీఎం-ఉషా నిధులు మూడు కోట్ల అరవై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యా వాతావరణాన్ని కల్పించడంతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఈ నూతన భవనంలో వందకు పైగా కంప్యూటర్లతో కూడిన అత్యాధునిక ల్యాబ్ను, డిజిటల్ విద్యకు అవసరమైన ప్రత్యేక తరగతి గదులను పూర్తిస్థాయి వసతులతో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థినులు కూడా సాంకేతిక రంగంలో రాణించేలా ఈ వసతులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. డిజిటల్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు.
