కృష్ణా జిల్లా బంటుమిల్లి మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నద్ధతపై బుధవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఎంపీడీవో అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను రాజకీయ పార్టీల నాయకులకు అధికారికంగా వెల్లడించారు.
మండలంలోని 21 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం 44 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో వివరించారు. మండలంలో మూడు గ్రామాలను అతి సమస్యాత్మకమైనవిగా, ఐదు గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని తెలిపారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు ఉంటే నిర్ణీత గడువులోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని, ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నేతలు సహకరించాలని కోరారు.
