జనగళం 24 ఆంధ్ర డెస్క్: తిరుపతి పార్లమెంట్ పరిధిలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల సమన్వయ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జనసేన ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు సమక్షంలో ఈ వ్యూహాత్మక భేటీ నిర్వహించారు. స్థానిక సంస్థల సమరంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల శ్రేణులు క్షేత్రస్థాయిలో పూర్తి సమన్వయంతో పనిచేసి తిరుగులేని విజయం సాధించేలా కార్యాచరణను సిద్ధం చేయడమే ప్రధాన ఎజెండాగా చర్చలు సాగాయి.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు వార్డు మరియు పంచాయతీ స్థాయిల్లో కూటమి పటిష్టతకు నేతలు దిశానిర్దేశం చేశారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్లాలని, విపక్షాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమన్వయ సమావేశంలో జనసేన పార్టీ తరఫున కిరణ్ రాయల్, కీర్తన, క్రికెట్ విజయ్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బాలాజీ, దామచర్ల సత్య హాజరుకాగా, భారతీయ జనతా పార్టీ నుంచి సామంచి శ్రీనివాస్, కోలా ఆనంద్, దయాకర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొని ఎన్నికల సన్నాహాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
