జనగళం 24 ఆంధ్ర డెస్క్: తిరుపతిలో నిర్వహించిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కమిటీల సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూటమి పక్షాలన్నీ సమష్టిగా సమరానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరణ కలిగిన బలమైన అభ్యర్థులను గుర్తించి ఎన్నికల బరిలోకి దింపాలని సూచించారు.
కూటమిలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు విభేదాలు లేకుండా పరస్పర సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి కూటమి బలపరిచిన అభ్యర్థుల భారీ విజయానికి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమన్వయ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని మూడు పార్టీల ముఖ్య ప్రజాప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
