స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: ఎమ్మెల్యే పంతం నానాజీ
- ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యులతో సమగ్ర సమీక్ష
- వార్డు, గ్రామాల వారీగా బలబలాలు, వ్యూహాలపై సుదీర్ఘ చర్చ
కాకినాడ రూరల్:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యులతో సమగ్ర సమీక్షా సమావేశం జరిగింది. స్థానిక శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారి అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి పంచాయతీ, వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో కదలాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, ఓటర్ల జాబితాల పరిశీలన, గ్రామాల్లో పార్టీ పరిస్థితులు మరియు ప్రచార వ్యూహాలపై కమిటీ సభ్యులతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించి, దిశానిర్దేశం చేశారు.
జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకూ బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో సమన్వయ కమిటీ పాత్ర అత్యంత కీలకమని, గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి విజయకేతనం ఎగురవేయాలని కోరారు.
ఈ సమావేశంలో కాకినాడ రూరల్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, మండల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
