ప్రముఖ గాయకుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు బొందిలి బాలాజీ సింగ్ అకాల మృతి పట్ల అవనిగడ్డ శాసనసభ్యులు, మాజీ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు సమీపంలోని కొత్తరావూరులో గల బాలాజీ సింగ్ స్వగృహానికి బుధవారం విచ్చేసిన ఆయన, దివంగత గాయకుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం శోకతప్త కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాలాజీ సింగ్ దివిసీమ అంతటా గనగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాటలను అద్భుతంగా ఆలపిస్తూ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారని, అవనిగడ్డ గాంధీక్షేత్రంలో నిర్వహించిన అనేక సాంస్కృతిక వేదికలపై ఆయన గానం శ్రోతలను మంత్రముగ్ధులను చేసిందని ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ స్మరించుకున్నారు.
