జనగళం 24 ఆంధ్ర డెస్క్: అమరావతి సచివాలయంలోని నాల్గవ బ్లాక్లో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శాఖాపరమైన కీలక అంశాలపై ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, ఇతర ముఖ్య అధికారులతో కలిసి శాఖలో అమలవుతున్న వివిధ పథకాల ప్రగతిని నిశితంగా పరిశీలించారు. నిర్దేశిత సమయంలోగా పేదల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు.
సమీక్షలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, పెండింగ్లో ఉన్న వివిధ అంశాలు, ఆర్థిక వనరుల సమీకరణ, లబ్ధిదారులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులపై విస్తృతంగా చర్చించారు. ఎలాంటి అలసత్వానికి తావులేకుండా పనులను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా చేరుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
