జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పన్నెండు నగరపాలక సంస్థలు, ఇరవై తొమ్మిది పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియను ఎన్నికల సంఘం అధికారికంగా పూర్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ చంద్ర పునేఠా రెండు ప్రత్యేక నోటిఫికేషన్లపై సంతకాలు చేశారు. పురపాలికలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల వారీగా తాజా ఓటర్ల తుది జాబితాను ఈ నెల ఇరవై రెండో తేదీన పూర్తిస్థాయిలో అధికారికంగా ప్రచురించాలని జిల్లాల అధికారులను ఆదేశించారు.
ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తదుపరి దశకు చేరుకోనుంది. కార్పొరేషన్ల మేయర్లు, పురపాలక చైర్మన్లు, అలాగే డివిజన్లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారుకు మార్గం సుగమం కానుంది. రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చిన వెంటనే రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
